Pages

Tuesday, March 2, 2010

నేనే ప్రేయసినీ, నేనే విధివంచితనీ


కమలాదాస్‌ (మాధవికుట్టి) వి.ఎమ్‌.నాయర్, బాలమణి దంపతులకు 31, మార్చి, 1934న జన్మించారు. తన కన్నా వయసులో పదిహేనేళ్ళు పెద్దవాడైన మాధవదాస్‌ని వివాహమాడిన కమల తన 17వ ఏట నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు. స్త్రీవాద కవితకు కమల ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని పొందారు. 'ది సైరన్స్', 'సమ్మర్ ఇన్‌ కలకత్తా', 'అల్ఫాబెట్స్ ఆఫ్ లస్ట్‌', తదితర ఆంగ్ల రచనలతో పాటు తనుప్పు, నెయ్ పాయసం, తదితర మలయాళీ రచనల ద్వారా కమల సుప్రసిద్ధం. డెభ్భైఐదేళ్ల వయసులో 31, మార్చి, 2009న కమల మరణించారు. ఆమె కవితల్లో కొన్నింటికి తెలుగు అనువాదమిది.

హిజ్రాల నాట్యం...

హిజ్రాలు వచ్చేదాకా ఒకటే ఉక్కపోత
చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద లంగాలు,
చేతుల్లో చిడతలు, అందెల సవ్వడులు
మంకెన పూల ఎర్రని చిత్తడిలో
వాలుజడల ఊయలలు,
చిక్కని కాటుక రేఖల కాంతిపుంజాలు,
వాళ్ళు నర్తిస్తున్నారు, నర్తిస్తూనే ఉన్నారు
పాదాలు చిట్లి నెత్తురోడేలా
వాళ్ళు నర్తిస్తున్నారు
వాళ్ళ చెక్కిళ్ళపై పచ్చబొట్లు,
సిగలో మల్లెలు, కొందరు కారునలుపు
మరికొందరు పాలతెలుపు
కరుకైన గొంతుల్లో
దిగులుపడిన పాటలు
భగ్న ప్రేమికులు, ఛిద్ర గర్భస్థ శిశువుల
గురించి వాళ్ళు పాడుతున్నారు
మరికొందరు గుండెలు బాదుకుంటున్నారు
ఇంకొందరు శూన్యానందంలోకి ఒరిగిపోతున్నారు
ముప్పిరిగొన్న కరవు బరువుతో
చితిలో సగం కాలిన కట్టెల్లా
వాళ్ళు బలహీనంగా ఉన్నారు
చెట్ల మీద కాకులింకా నిశ్శబ్దంగా ఉన్నాయి
పిల్లలింకా రెప్పవాల్చ లేదు,
ఇప్పటికీ,
మెలికలు తిరుగుతున్న వాళ్ళనింకా
అందరూ చూస్తూనే ఉన్నారు
ఉరుములు, మెరుపులతో ఆకాశం విచ్చిపోయింది
సన్నటి వానజల్లు
అటక మీద బల్లులు, ఎలుకల మూత్రంతో తడిసిన
మట్టికంపును మోసుకుంటూ
సన్నటి వానజల్లు....
-
రాతియుగం
ప్రియమైన మొగుడు, మనసులో తిష్ఠ వేసిన ప్రాచీన ప్రవాసి
గాబరా గూళ్ళనల్లుతున్న ముసలి బొంత సాలీడు
దయ చూడు,
నువ్వు నన్నొక రాతిబొమ్మని చేశావు
గ్రానైట్ పావురాన్ని చేశావు
నా చుట్టూ పాతగోడల ఇరుకు గదిని కట్టావు
నువ్వు చదువుతూ, చదువుతూ అనాలోచితంగా
సొట్టలు పడిన నా ముఖాన్ని విసురుగా తాకావు
చెవులు చిల్లులు పడే నీ మాటలు
నా తెల్లవారుజాము నిద్రని చెదరగొట్టాయి
కలలు కంటున్న నా కంటిని నీ వేలితో గుచ్చావు
అప్పటికీ, నా పగటి కలల్లోకి
దృఢకాయులైన పురుషుల నీడలు ప్రవహించాయి
పోటెత్తిన నా ద్రవిడ రక్తంలోకి వాళ్ళు శ్వేతసూర్యులై ఇంకిపోయారు
పవిత్ర నగరాల కింద
రహస్యంగా మురుగు కాల్వలు పారుతున్నాయి
నువ్వు నన్ను వదిలి వెళితే
నేను నా నీలిరంగు కారులో
నీలికడలి ఒడ్డునే ప్రయాణించి
నలభై అలజడి అడుగుల దూరం పరుగెత్తి
మరొకరి తలుపు తడతాను
కిటికీల సందుల్లోంచి ఇరుగుపొరుగు చూస్తూనే ఉంటారు
వానలా నేనొచ్చి, వెళ్ళడాన్ని చూస్తూనే ఉంటారు
అడగండి, అందరూ నన్నడగండి...,
నాలో వాడేం చూశాడో అడగండి,
వాణ్ణందరూ దుస్సాహసి అనీ, పోకిరీ అనీ
ఎందుకంటారో అడగండి
నా పొత్తికడుపు కింద పట్టు చిక్కేముందు
వాడి చెయ్యి పాము పడగలా ఎందుకు ఊగుతుందో అడగండి,
నా రొమ్ములపై వాడో మహావృక్షమై తెగిపడి, ఎలా నిద్రిస్తాడో అడగండి
జీవితం మరీ ఇంత చిన్నదవడమేమిటని అడగండి,
అందులో ప్రేమ మరీ చిన్నదవడమెందుకో అడగండి,
నన్నడగండి,
ఆనందమంటే ఏమిటో, దాని మూల్యమేమిటో
నన్నగడగండి....

మా బామ్మ ఇల్లు
అక్కడొక ఇల్లుండేది...
ఒకప్పటి నా ప్రేమనగరది
ఆమె మరణంతో ఇల్లు మూగబోయింది
అప్పుడు నేనింకా చిన్నపిల్లనే
పుస్తకాల్లో కదిలే పాములతో
నా నెత్తురు తెల్లగా పాలిపోయేది
ఎన్నిసార్లనుకున్నానో
అక్కడికి వెళ్ళాలని
కిటికీల గుడ్డికళ్ళలోంచి తొంగి చూడాలని
గడ్డకట్టిన గాలి సవ్వడి వినాలని
కనీసం, భయంకరమైన నిరాశలోంచి
గుప్పెడు చీకటినైనా తెచ్చి
నా పడకగది వెనుక కుక్కపిల్లలాగా
కట్టేసుకోవాలని,
నువ్వు నమ్మవు కానీ నేస్తం,
నేనెలాంటి ఇంట్లో పెరిగానో,
ఇల్లంటే నాకెంత ప్రేమో,
నాకెంత గర్వమో...!
ఇప్పుడు నేను దారితప్పి,
ప్రేమకోసం, ఒక్క చిన్న మార్పు కోసం
అపరిచితుల తలవాకిట అడుక్కుంటున్నాను

పునీత

నిజం,
ఒకటి, రెండు కట్టుబాట్లని నేను మీరాను
అయినప్పటికీ, దైవాన్ని కాని, సమాజాన్ని కాని
క్షమాభిక్ష కోసం అర్థించను
అతిక్రమణలోనే ఆనందాన్ని అనుభవించాను
నిజంగా, నన్ను నేను పునీతురాలిగానే భావిస్తాను
పుణ్యం కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు,
పరిత్యాగంలోని నిజమైన స్వేచ్ఛా సమయాల కోసం మాత్రమే!

జబ్బు పడ్డాక...
మరణమూ లేదు, అంతమూ లేదు,
ఉన్నదల్లా అలసిన దేహం అలవాటైన నేలచాళ్ళలోకింకి పోవడమే!
నా మోకాలి మీద తన బాధతప్త ముఖాన్నుంచి అతనంటాడిలా...
'ప్రియా, నీకేం కాదు, నువ్వు బతుకుతావని నాకు తెలుసు,
నే కోరుకునేదదే...'
నా జబ్బు పచ్చపచ్చగా ఎదగడాన్ని చూస్తున్నాడతను
ఎండి, వదులైన చర్మం కింద ఎముకలు మొనదేలుతున్నాయి
గాజుకళ్ళలో పచ్చని మరకలు, దుర్గంధమైన శ్వాస,
అన్నింటినీ చూస్తున్నాడతను
అపరిచిత దైవాలకు నిత్యప్రార్థనలిప్పుడు
అతనికి అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి.
నేను నా నొప్పితో పోరాడుతున్నప్పుడు
నిర్లక్ష్యం అతణ్ణి బాధిస్తుందా?
వేకువనే నాలుగింటికి ఒంటరిగా అతను మేలుకుంటాడా?
ఆకలికి తగినంత మాంసం మిగల్లేదు
నెత్తురు కాముకత్వపు ఆటుపోట్లనిప్పుడు తట్టుకునేలా లేదు
స్వాస్థ్యపు అభ్యంగనం లేక చర్మం మొద్దుబారి, ఆపేక్షరహితమైంది
మరతను దేన్ని మోహిస్తున్నాడు,
లోలోపల దాగిన అంతరాత్మనేనా...?!

పరిచయం

నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు,
కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు
వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు,
నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను
నేను భారతీయురాల్ని, మలబార్లో పుట్టాను,
మేనిరంగు చామనఛాయ, మూడుభాషలు మాట్లాడగలను
అందులో ఒకటి కలల భాష, మిగతా రెండింట్లో రాయగలను
నన్ను ఇంగ్లిష్లో రాయద్దన్నారు, అది నా మాతృభాష కాదన్నారు
బంధుమిత్రులు, విమర్శకులు, మాటకొస్తే మీలో ప్రతి ఒక్కళ్ళూ...
నా మానాన నన్నెందుకు బతకనివ్వరు?
నాకిష్టమైన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు
నేనేది మాట్లాడితే అదే నా భాష,
దాని శృతులు, అపశృతులు, అర్థాలు, అపార్థాలు, వింతలూ, వికారాలు
అన్నీ... అన్నీ నావే, కేవలం నావి మాత్రమే!
అది వచ్చీరాని ఇంగ్లిషే కావచ్చు, సంకర భారతీయతే కావచ్చు,
తలతిక్కగానూ ఉండొచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది
మీక్కనిపించడం లేదా, నేనెంతటి మానవినో అదీ అంతటి మానవాంశే!
భాష నా ఆశలకీ, ఆకాంక్షలకీ, నా కోరికలకీ, నా ఆనందాలకీ గొంతునిస్తుంది
కాకులకు కావుకావుమనడం ఎలాగో, సింహాలకి గర్జించడం ఎలాగో
భాష నాకూ అలాంటిదే, అది మానవ భాష,
అది మనసు వ్యాకరణం, చూడగలిగిన, వినగలిగిన,
తెలుసుకోగలిగిన మనోవాక్కు
తుపానులో ఊగే చెట్లలాగా, వానాకాలపు మబ్బుతునకలాగా,
చితిమంటల చిటపటలాగా
అది చెవిటి, గుడ్డి మాట కాదు
నేను పసిదాన్నే, ఎదిగానంటున్నారు
దేహావయవాలు ఒంపులు తీరి, పొడవయ్యాయి,
ఒకటి, రెండు చోట్ల నూనూగు వెంట్రుకలు మొలిచాయి
ఏమడగాలో తెలియక నేను ప్రేమని అడిగినప్పుడు
అతను పదహారేళ్ళ యవ్వనాన్ని పడక గదిలో తోసి తలుపేశాడు
అతను నన్నేమీ కొట్టలేదు
కానీ నా స్త్రీదేహం దిగులు, దిగులుగా గాయపడింది
గర్భమూ, రొమ్ముల బరువుకింద నలిగి పోయాను
దీనాతిదీనంగా ముడుచుకు పోయాను.
తరువాత నేను చొక్కా తొడుక్కున్నాను
నా తమ్ముడి లాగూలు వేసుకున్నాను
జుట్టుని పొట్టిగా కత్తిరించేశాను
నా స్త్రీత్వాన్ని మరచిపోయాను
'చీర కట్టుకో, ఆడపిల్లలా, పెళ్ళాంలా ఉండు' అని వాళ్ళన్నారు
కుట్లు, అల్లికలు నేర్చుకో, వంట నేర్చుకో
పనివాళ్ళతో పోట్లాడు,
సంసారిలా ఉండంటూ ఎల్లల కాపలాదార్లు మొత్తుకున్నారు
గోడల మీద కూర్చోకు, మా కిటికీల్లోకి తొంగి చూడకు
'అమీ'లా ఉండు, కమలలా ఉండు, కనీసం
మాధవికుట్టిలానైనా ఉండన్నారు
పేరెంచుకునే వేళొచ్చింది
ఒక పేరు, ఒక పాత్ర...
నటించకు, పిచ్చిదానిలాగానో, అపžరసలాగానో నటించకు
ప్రేమలో మోసపోతే అసహ్యంగా ఏడవకు
నేనొకతణ్ణి కలిశాను, ప్రేమించాను
అతని పేరెందుకులే, నాలాగే ప్రతి స్త్రీ కోరుకునే మగవాడతను
అతనిలో నదుల ఒరిపిడి, నాలో కడలి నిరీక్షణ
నేను ప్రతి ఒక్కళ్ళనీ అడిగాను
'ఎవరు నువ్వు?'
అందర్నుంచీ ఒకటే జవాబు... 'నేను'!
ప్రతిచోటా తనని తాను 'నేన'ని పిలుచుకునే వ్యక్తినే చూశాను
ఒరలో కత్తిలా ఉన్నాడతను
విచిత్రమైన నగరాల హోటళ్ళలో
అర్థరాత్రి ఒంటరిగా తాగుతూ నేనే
ఒంటరిగా నవ్వుతూ నేనే
ప్రేమించిందీ నేనే, అవమాన పడ్డదీ నేనే
గొంతులో గిలక అడ్డంపడి తన్నుకుంటూ చస్తున్నది నేనే
నేనే పాపినీ, నేనే రుషినీ
నేనే ప్రేయసినీ, నేనే విధివంచితనీ
నీవి కాని మోదాలేవీ నా దగ్గర లేవు
నీవి కాని ఖేదాలేవీ నాకు లేవు
నన్నిప్పుడు నేను కూడా 'నేన'నే పిలుచుకుంటాను

అద్దంలోకి చూడు...

ప్రేమించడానికి మగాడు దొరకడం చాలా సులభమే
కానీ ఆడదానిగా నీ కోరికల పట్ల నిజాయితీయే ముఖ్యం
అతని అద్దం ముందు నగ్నంగా నిలుచో
నువ్వెంత బలవంతురాలివో అతణ్ణి చూడనీ, నమ్మనీ
అప్పుడు నువ్వు ఇంకా మృదువుగా, ఇంకా యవ్వన శోభస్కురాలిగా
ఇంకా ప్రేమైకమూర్తిగా కనిపిస్తావు
నీ అభిమానాన్ని వ్యక్తీకరించు
అతని దేహావయవాల పటుత్వాన్ని గమనించు
షవర్ కింద తడుస్తూ ఎరుపెక్కే అతని కళ్ళని గమనించు
బాత్రూంలో సిగ్గుపడే నడకల్ని గమనించు
టవళ్ళని విడిచిపేట్టేయడాన్ని గమనించు
చిత్రంగా కదులుతూ అతను మూత్ర విసర్జన చేయడాన్ని గమనించు
అన్నింటినీ..., అన్ని ఇష్టమైన కదలికల్ని గమనించు
అతణ్ణి సిసలైన మగవాణ్ణి, నీవాణ్ణి చేసే ప్రతి కదలికనూ గమనించు
నిన్ను పరిపూర్ణ స్త్రీని మార్చే అన్నింటినీ అతనికి బహూకరించు
పొడవైన జుట్టు, రొమ్ముల నడుమ సువాసన
రుతుస్రావపు వెచ్చని స్పర్శ, అనంతమైన
నీ ఆడతనపు ఆకళ్ళన్నింటినీ అతనికి బహూకరించు
ప్రేమించడానికో మగాడు దొరకడం సులభమే
కానీ తరువాత అతను లేకుండా
జీవించడమంటేనే ఏటికి ఎదురీదడం
జీవచ్ఛవంలా ఆగంతుకుల మధ్య కలియదిరుగుతూ,
అన్వేషణ ముగిసిన కళ్లతో,
నీ పేరుని పిలిచిన అతని చివరి పిలుపును
మాత్రమే వినగలిగిన చెవులతో
కొలిమిలో కాలిన ఇత్తడిలా
ఒకనాడు అతని స్పర్శ కింద వెలిగిన దేహంతో...
ఇప్పుడిలా కేవలం ఒక ఉంపుడుకత్తెలా, ముష్టిదానిలా
జీవించడమంటేనే ఏటికి ఎదురీదడం...!
-పసుపులేటి గీత






Monday, March 1, 2010

గాడ్‌... డామిట్!


హైదరాబాద్‌, 3 డిసెంబర్
సంతోష్‌ నగర్ వీధిలో ఓ ఎండుటాకు, పక్కనే గురితప్పి నేలమీద పడిన తూటా, అక్కడే బుల్లెట్ గాయంతో మరణాన్ని ఆహ్వానిస్తూ స్ట్రెచర్ పై ఓ పోలీస్‌ కానిస్టేబుల్...
ముంబై, 26 నవంబర్
కామా హాస్పిటల్ లో ఒక గదినిండా రక్తపు మరకలే, అదేరోజు తూటాలతో చిల్లులు పడిన తాజ్
హోటల్ గోడలు...
ఒంట్లో ప్రవహించాల్సిన నెత్తురు రోడ్లమీద పారుతుంటే మీ రక్తం ఉడికిపోవడం లేదా? ప్రశ్నల్ని చంపేసే పిరికితనం మిమ్మల్ని ఆవహిస్తోందా? భయపడుతున్నారా? మీరు భయాన్ని ప్రేమిస్తున్నారా?
దేవుడనేవాడు లేకుంటే ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉండేదో ఇప్పటికైనా మీకు తెలిసొచ్చిందా? నేనానాడే చెప్పాను, నా మాటెవరైనా విన్నారా? క్షణక్షణం భయంతో వణికిపోతూ, కాళ్ళ కింద నేల కాకుండా నెత్తురే తడితడిగా తగులుతున్న ఈ క్షణంలోనైనా దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించాలనిపించడం లేదా? నేనెవరో మీకు తెలిసుండాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ నా అవసరం మీకేమైనా ఉందేమోననిపించి ఇలా వచ్చాను. నన్ను జీన్ పాల్ సార్త్ అంటారు. నా తాత్విక చింతనకు మూలాధారం 'అస్థిత్వమే' తప్ప దేవుడు కాదు. రెండో ప్రపంచ యుద్ధాన్ని కళ్ళారా చూసినవాణ్ణి, మూడో ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోయిన వాణ్ణి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం నెలకొన్నప్పుడే నేను మూడో ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించాను. ఒకవేళ అదే నిజమైతే ఆ యుద్ధం సృష్టించే భయోత్పాతం అంతా ఇంతా కాదు. చేయని నేరాన్ని మౌనంగా అంగీకరించాల్సిన వాళ్ళలా నెమ్మదిగా ప్రజలు ఆ దాష్టీకాన్ని భరించడానికి మానసికంగా తయారవుతారు. వాళ్ళు భయాన్ని ప్రేమించడం నేర్చుకుంటారు. జలుబుకో, దగ్గుకో అలవాటు పడినట్టుగా వాళ్ళు భయపడడానికి అలవాటు పడతారు. ఆ బరువు కింద వాళ్ళు నిస్సహాయంగా అణగారిపోతారు. ఈలోగా ఆందోళనకు గురై, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన ప్రభుత్వాలు ఒకదాన్నొకటి అనుమానంగా చూసుకుంటాయి. ఆ తత్తరపాటులో ఏదో ఒక దేశం తొందరపాటుగా వ్యవహరిస్తుంది. దాన్ని సాకుగా తీసుకుని మరో దేశం దాని పీక పట్టుకుంటుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అంతూపొంతూ లేని హింస. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్దాల్లో మనం ప్రాణాల్ని పణంగా పెట్టాం. ఇక మరోసారి ఈ మహమ్మారి కన్ను తెరిస్తే మనం అకారణంగా మూకుమ్మడి చావు చస్తాం. యుద్ధమేదైనా చివరికి మిగిలేదేమీ ఉండదు. యోధులుండరు, నాయకులుండరు, భయవిహ్వలులైన మానవ సముదాయంపై ఒక మహోపద్రవం విరుచుకు పడుతుందంతే! ఆనాడు అంటే 1830ల తరువాత యూరప్‌ వెలుపల పలు సంఘటనల్లో సామూహిక హత్యాకాండ జరిగింది. వీటి ద్వారా అమెరికా సామ్రాజ్యవాదానికి తందాన పాడే ఫ్రాన్సు, బ్రిటన్‌ వంటి అగ్రరాజ్యాలు తమ వలసవాద సామ్రాజ్య వ్యవస్థల్ని బలపరచుకున్నాయి. పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అగ్రరాజ్యాలు పేదదేశాలకు ఆయుధాల్ని సరఫరా చేసి, విభజించి పాలించే కుట్రలకు పాల్పడడం వల్ల స్థానిక జాతుల్లో తిరుగుబాటుదారులు తలెత్తి సంక్షోభాలు నెలకొంటున్నాయి. వలసవాద దేశాల సైన్యానికి, స్థానిక తిరుగుబాటుదారులకు మధ్య నిరంతర హింసకు తెరలేచింది. ఈ స్థానిక తిరుగుబాటుదారుల్లో స్థానిక తెగలు, జాతీయవాదులు, మతవాదులు కూడా ఉంటారు. మానవాళి భయం కింద నలిగి చావడానికి ప్రచ్ఛన్న యుద్ధం చాలనుకున్నాను. కానీ ప్రచ్ఛన్న యుద్దానంతరం కూడా ప్రపంచాన్ని గ్లోబల్ వార్ భయం వీడనేలేదు. మూడో ప్రపంచ యుద్ధమైనా, పవిత్ర యుద్ధమైనా, పేరేదైతేనేం, ఇవాళ అంతర్జాతీయ సమాజాన్ని బాంబులు వేటాడుతున్నాయి. అయినప్పటికీ 'మనిషి ఇంకా బతికే ఉన్నాడు!' అదే నా ఆనందం. ఉగ్రవాదం ఒక భయంకరమైన ఆయుధం, విషాదమేమిటంటే పేదలకు అంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ ఆయుధమే వారిని తన ఆయుధంగా మార్చుకుంటుంది. దైవాంశ సంభూతులారా, దేవుని ప్రతినిధులారా, దేవుని సైనికులారా, మీ లక్ష్యం ఏదైనప్పటికీ, నేను మీకు నాడూ, నేడూ చెబుతున్నదొక్కటే. ఈ భూమ్మీద అనంతమైన అస్థిత్వంలోకి మనం మన ప్రమేయం లేకుండా వచ్చి పడ్డాం. ఇందులో అర్థవంతమైన ఖగోళ లేదా దైవిక కార్యకారణ సూత్రమేదీ లేదు. ప్రపంచమొక అంధకూపం. జీవితం అయితే భయంకరం, కాకుంటే అర్థరహితం, అంతే! ఇందులో విలువైనదేదైనా ఉందంటే అది మనం సృష్టించుకున్న ప్రాపంచిక విలువలు మాత్రమే. నేను 'అస్థిత్వవాది'ని. ఒక సైంటిస్టు కంటితో చూస్తే ప్రతిదీ అస్థిత్వానికి లోబడి ఉన్నదే! మానవ ప్రవర్తన ప్రేమ, పగ, లోభం, త్యాగం, హింస, ఉదార గుణాల మేలు కలయిక. మొత్తంగా చైనావాళ్ళు చెబుతారే, 'యిన్‌ అండ్‌ యాంగ్‌' అని అలాగన్నమాట! మానవ స్వభావం మంచి, చెడుల సమ్మిశ్రితం. ప్రపంచాన్ని ప్రేమ, హింస ఆవరించి ఉన్నాయి. భగవంతుని ఉనికి మనిషి స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిది. దేవుడి ఉనికిని ఒప్పుకున్నామా, ఇక మనిషిగా మన స్వేచ్ఛ కేవలం భ్రమగానే మిగిలిపోతుంది. దేవుడి చూపు మనిషి స్వేచ్ఛను హరించి వేస్తుంది. మనిషి తనను తాను మలచుకునే శక్తిని హరించి వేస్తుంది. ఈ అనంత సృష్టిలో మనిషి ఒంటరివాడు. విశ్వానికి అతనెప్పుడూ పరాయివాడే! ఈ అపరిచిత సృష్టికి అర్థం బోధపడకే ఆ ఖాళీని పూరించడానికి మానవుడు దేవుణ్ణి సృష్టించాడు. తనకు అవగతం కాని అనేక వేదనలకు పరిష్కారంగా ఈ అతీతశక్తినే ఆశ్రయించాడు. నిత్య చైతన్యశీలి అయిన మానవుడు తనకు తెలియకుండా తన మీద తానే ఒక నిఘానేత్రానికి దృష్టిదానం చేశాడు. 'మీరు నమ్మరు కానీ, చానాళ్ళుగా నేను దేవుడితో పబ్లిక్‌ రిలేషన్స్ నడుపుతున్నాను. అయినా సరే అతని ఊసంటే పెద్దగా ఇష్టపడను. ఒకానొకనాడు నేను అగ్గిపుల్లలతో ఆడుకుంటున్నాను. ఆటలో రగ్గును తగలబెట్టేశాను. అప్పుడు చూడాలి, నా ముఖాన్ని! భయపడి పోయాను, నా తెంపరితనానికి దేవుడు తగిన దండన విధిస్తాడని వణికిపోయాను. తప్పు కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుండగా దేవుడు చూడనే చూశాడు. అతని చూపు నా మెదడులోకి చొచ్చుకుపోయింది. అది సూటిగా తప్పును కప్పెడుతున్న నా చేతుల మీదికి పాకింది కూడా! అతనికి కనబడకుండా దాక్కునే చోటే లేకపోయింది. దొరికిపోయాను. తప్పించుకోవడానికి బాత్రూమ్‌లోకి చొరబడ్డాను. అయినా అతను చూస్తూనే ఉన్నాడు. ఎలాంటి రక్షణ లేకుండా వేటగాడి బాణానికి దొరికిపోయిన లేడిపిల్లలా ఉంది నా పరిస్థితి. నాకు చాలా అవమానంగా అనిపించింది. కోపంతో రగిలిపోయాను. అయినా చేసేదేంలేక చివరికి మా తాతలాగా గాడ్‌ డామిట్, గాడ్‌ డామిట్, గాడ్‌ డామిట్... అని అసహనంగా గొణుక్కున్నాను. అంతే దెబ్బకి దేవుడు వదిలాడు, మళ్ళీ నా వంక కన్నెత్తి చూడలేదు, ఇప్పటిదాకా!' అదీ దేవుడితో నా సంబంధం.
మనం మనకోసం బతకడం, ఇతరుల కోసం బతకడం..., ఈ అంతర్మధనం, బహిర్ పోరాటాల మధ్య వైరుధ్యమే జీవితం. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం బతకాల్సి వస్తుందో అప్పుడే మన స్వేచ్ఛకు శృంఖలాలు బిగిసిపోతాయి. ఈ వైరుధ్యంతో మనిషి జరిపే పోరాటంలోనే స్వీయాన్వేషణ మొదలవుతుంది. మనిషిని శాసించే సామాజిక, వైయక్తిక బంధనాలతో సలిపే పోరాటంలోనే మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం. దేవుడు అనే అతీత భావజాలం మనల్ని నియంత్రిస్తుంది. మన వికాసానికి అది పరిమితుల్ని విధిస్తుంది. దీనినే నేను వ్యతిరేకించాను. అంధవిశ్వాసమంటే నాకసహ్యం. నాకూ నమ్మకాలున్నాయి. అస్థిత్వవాదమే మానవతావాదమని నమ్మిన వాణ్ణి. నా నమ్మకానికి మూలాధారం విశ్వమానవ సౌభ్రాతృత్వమే.
మనుషులు ఒకరి పట్ల మరొకరు పరమ క్రూరంగా ప్రవర్తించగలరు. చెప్పుకోదగిన కారణమేదీ లేకుండానే ఆధునిక అమెరికా వేలాది హత్యలు, లక్షలాది అత్యాచారాలతో వర్ధిల్లుతోంది. మనలో కొంతమంది ధనికులుగా, కొందరు మేధావులుగా, కొందరు ఆరోగ్యవంతులుగా, మరికొందరు దరిద్ర నారాయణులుగా ఆకలి చావులు చావడానికన్నట్టే పుడతారు. అది కేవలం అవకాశం మాత్రమే. అద్భుతవశాత్తో, ప్రమాదవశాత్తో కొందరు అమెరికన్లు ఆగర్భ శ్రీమంతులుగాను, మరికొందరు తిండికి గతిలేని ఇథియోపియన్లుగాను పుడతారు. తృతీయ ప్రపంచ దేశాల్లో వేలాది పిల్లలు పౌష్ఠికాహార లోపంతో కన్నుమూస్తున్నారు, ధనికదేశాల వారికీ సంగతే తెలియదు మరి! జీవితానికి సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, అనుక్రమణికలు ఉండవు. చెడ్డవారికి నరకాన్ని, మంచివారికి స్వర్గాన్ని నిర్ణయించడం కోసం భూమి అనేది మనుషుల్ని పరీక్షించడానికి దేవుడు ఎన్నుకున్న పరీక్షాస్థలి కాదు. అలాంటి నమ్మకాలన్నీ పిల్లచేష్ఠలవంటివి. దురదృష్టమేమిటంటే కోట్లాదిమంది ఇంకా అలాంటి నమ్మకాల్నే అంటిపెట్టుకున్నారు. శతాబ్దాల తరబడి దేవుని పేరిట, మతం పేరిట కోట్లాదిమంది మరణిస్తూనే ఉన్నారు. లేని దేవుని కోసం ఉన్న వాళ్ళ ప్రాణాల్ని బలి తీసుకునే ఈ ఉన్మాదం కన్నా మనలోని రాక్షసత్వానికి ప్రబల సాక్ష్యమేముంది? విశ్వం అందరి దృష్టిలోను ఒక్కలాగే ఉండదు. మానవావసరాల కన్నా విలువైన 'మంచి, చెడుగు'లేమీ లేవు. ఒక పసిబిడ్డ డిప్ఫ్తీరియాతో చనిపోతే, డిప్ఫ్తీరియాతో క్రిములు 'పాప, పుణ్యాల' గురించి ఆలోచించవు. అమెరికా బాంబులు రెండు లక్షల మంది ఇరాకీలను చంపినా, అమెరికాలోను, ఇరాక్‌లోను సూర్యుడు ఉదయించే తీరుతాడు. మంచి, చెడులన్న వాటికి, ప్రకృతికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ జీవితాన్ని మరింత వికసింపజేసుకోవడానికి మనిషికి మాత్రమే ఈ మంచి చెడులు అవసరం.
అన్ని జీవుల్లాగే మనిషి కూడా ఒక 'బయోలాజికల్ క్రీచర్'. మనం కల్పించుకున్న విలువలకు, విశ్వానికీ సంబంధం లేదు. అవి మనకు, మన తోటివారికి మాత్రమే చెందినవి. ఏ దేవుడూ ఎలాంటి నియమనిబంధనలను విధించని ప్రపంచంలో మనం పుట్టాం. పుట్టుకతో వచ్చిన స్వేచ్ఛ కడదాకా ఉండదు. నిజానికి మనిషికి స్వేచ్ఛ వర్తించదు. అయినా స్వేచ్ఛే జీవితానికి జీవధాతువు. తరాల పర్యంతమూ స్వేచ్ఛ కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ప్రశ్నించీ, తిరగబడీ, ఓటమే తప్ప గెలుపెరుగని ఈ యుద్ధంలో మానవాళి అలుపెరుగని పోరు సాగిస్తూనే ఉంది. పుట్టిన నాటి నుంచి మన పరిసరాల, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రభావాలకు మనం లోనవుతాం. ఈ ప్రభావమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మన చర్యల్ని, ప్రతిచర్యల్ని నిర్దేశిస్తుంది. నేను ప్రతిపాదించిన అస్థిత్వవాదంలో పరిత్యాగం, పరితాపం, నిరాశ అనేవి ప్రధానమైనవి. ఇవి వినడానికి కాస్త దుఃఖపూరితంగా ఉన్నప్పటికీ మనిషి ఆశావాదిగా మారి స్వీయాన్వేషణకు పూనుకోవడంలో వీటి పాత్ర చాలానే ఉంది. ఇందులో పరిత్యాగమంటే దేవుణ్ణి పరిత్యజించడమే. మన చర్యలన్నింటికీ మనదే బాధ్యత, మరెవరో తీర్పరులు కారు. ఒంటరిగా అనంతమైన బాధ్యతల్ని తలకెత్తుకోవడంలో మనిషి పడే ఆందోళనే పరితాపం. మనం మన మీద మాత్రమే ఆధారపడి తీరాలన్న తెలివిడే నిరాశ. ఏదీ మన చేతుల్లో లేదు, అదే సమయంలో అన్నింటికీ మనమే బాధ్యులం. ఈ జ్ఞానంతోనే మనిషి మానవత్వాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అందుకే మీ చుట్టూ ఎన్ని దాష్టీకాలు జరిగినా న్యాయం కోసం పోరాడడాన్ని మానకండి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వంద చిన్నా చితకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నా దేశాల మధ్య, ప్రజల మధ్య సమ్ఘీభావం కోసం గొంతు విప్పడాన్ని మానకండి. ఎంత నెత్తురు చిందినా శాంతి కోసం ఎలుగెత్తడాన్ని మానకండి. ముఖ్యంగా భయాన్ని ప్రేమించకండి!
-పసుపులేటి గీత

పద్దెనిమిదో శతాబ్దానికి వోల్టైర్ లాగా, పందొమ్మిదో శతాబ్దానికి విక్టర్ హ్యూగోలాగా, ఇరవయ్యో శతాబ్దపు మేధో ప్రపంచానికి జీన్‌పాల్ చార్లెస్‌ ఎమార్డ్ సార్త్ ఆరాధ్యనీయుడు. అస్థిత్వవాది, రచయిత, రాజకీయవాది అయిన సార్త్ 21 జూన్‌ 1905న పారిస్‌లో జన్మించారు. ఆయనకు 1964లో సాహిత్యానికిగాను నోబెల్ బహుమతి లభించింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. సార్త్ 1929లో సిమోన్‌ డి బోవార్ (ఫెమినిస్ట్
ఉద్యమకర్త, 'సెకండ్‌ సెక్స్' రచయిత)ను కలుసుకున్నారు. వారి స్నేహం చిరకాలం పాటు సాగింది. నాటి ఫ్రెంచి బూర్జువా సామాజిక కట్టుబాట్లను వారివురూ వ్యతిరేకించారు. సార్త్ 1939లో సైన్యంలో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన జర్మనీ సైన్యానికి చిక్కి తొమ్మిది నెలలు యుద్ధఖైదీగా గడిపారు. ఆయన కమ్యూనిజం పట్ల ఆకర్షితులైనా తరువాతి కాలంలో పూర్తిగా అస్థిత్వవాద అధ్యయనానికే అంకితమయ్యారు. సార్త్ రచనల్లో 'బీయింగ్‌ అండ్‌ నథింగ్నెస్', 'నో ఎక్జిట్', ప్రసిద్ధం. ఆయన 15, ఏప్రిల్ 1980న పారిస్‌లో మరణించారు.

Monday, February 22, 2010


చినుకుల గొడుగు
'వేసవి నాటి ధూళిదుమారాన్ని గుర్తు చేస్తుంది నాకు తొలకరి చినుకు, ఈ చినుకుకు నిరుటి జ్ఞాపకాలేవీ లేవు, ఏడాదంటే గతం తాలూకు ఏ గుర్తుల్నీ మననం చేసుకోలేని విధంగా తర్ఫీదు పొందిన జంతు'వంటాడు ఇజ్రేలీ కవి యెహుదా అమిచా. సరిగ్గా అలాగే ఈ చినుకు ఏ జ్ఞాపకాల తడి అంటని పాలిథిన్ కవరులా నా ముఖాన్ని కమ్ముకుని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దారుల మీద శృతి తప్పని చక్రాల జలతరంగిణి, వాహనాలపై వానచినుకుల మాఘమల్హారం. ఫుట్పాత్ నదిలోకి తర్జుమా అవుతోంది. నడిరోడ్డు మీద సముద్రం ఒళ్ళువిరుచుకుంటోంది. డ్రైవర్లు స్టీరింగు పట్టుకున్న సరంగులే అయ్యారు. వంగిన నడుం మీద ఎడమచేతి నుంచి, కుడిచేత్తో ఎదురుగాలిని అదిలిస్తూ, పట్టుతప్పుతున్న కాలిమడమల్ని మందలిస్తూ, వయోభారపు విన్యాసాలకి ఒళ్ళప్పగించిన ఒకానొక ముసలావిడ ఆటోచక్రాల ఆకతాయితనాన్ని తిట్టుకుంటోంది. పిడికిట్లో ముద్దకట్టిన చద్దన్నంలా చలికి వజవజలాడుతున్న ఆమె పాదాల కింద ఏ మాన్హోల్ నోరు తెరచుకుందో, వానంటే నేల మీద నడిచే కృష్ణబిలం. మనిషి లోపలి మనిషిలా, మనిషి లోపలి మబ్బులా నల్లటి చిక్కటి చీకటి వాన, ఏ పేదగుడిసెని ఊడ్చుకు పోవడానికో కన్ను తెరచిన పెనుతుపాను కూనలాంటి చినుకు, వానొస్తే కూలిదొరక్క పస్తులతో ముడుచుకుని పడుకునే బడుగుల ఆకలి కేకల గొంతుని చల్లగా నులిమే హంతకురాల్లాంటి చినుకు, చీకటంటే అర్థం కాని పసి పిల్లల గుండెల్లో ఒంటరితనపు సుడిగుండమై గుక్క పట్టే చినుకు,... అయితేనేం, వరిమళ్ళలో పరమాన్నపు పలవరింతై పులకలెత్తేందుకు పరుగులెత్తుతున్నదీ ఈ చినుకేగా!
చూరుల నుంచి కిందికి జారుతున్న చినుకు, కిందికే జారుతున్న చినుకు..., ప్రతిసారీ అపరిచిత నేస్తంలా పలకరించే చినుకు ఎప్పట్లాగే కిందికే జారుతోంది. పారిపోయేందుకు అవకాశంలేని ఖైదీల్లా వాన తెరల నడుమ రోడ్డు పక్కన చెట్లు. వాటి నీడల తలుపుల్ని తడుతూ, తడుపుతూ, చినుకు..., తలుపు తట్టిన చప్పుడైతే రెమ్మల్ని తెరిచి చూశాయి ఆకులు, ఎదురుగా చినుకు రాలుతోంది. 'అరెరె, కిందపడి పోతోంది, పట్టుకోండి...' అంటూ ఆతృతగా గలగలలాడాయవి! అలికిడికి చుట్టూ ఉన్న చెట్లన్నీ చినుకుపిట్టకి కొమ్మలందించబోయాయి, అయినా కిందికి జారడమే తప్ప, తీగలా పైకల్లుకోవడమెలాగో తెలీలేదు దానికి. చెట్లు చిన్నబోయి తలలు వాల్చాయి. కాలం కూడా ఇంతే, గుప్పెట్లో ఇమడదు. చినుకు జారుతూనే ఉంది, ఇంకెంత సేపు జారాలోనన్న బెంగలేదు, కిందపడి పోతానన్న బెదురు లేదు. రెక్కలున్న ప్రతిదీ పైకే ఎగరాలని ఎవరు చెప్పారు...? అంటూ చినుకు నావైపు క్షణమాత్రం సాలోచనగా చూసింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? ఉన్నత శిఖరాలు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు,... అంతా ఉన్నతంగానే ఉండాలని సమాజం నిర్దేశించింది కనుక 'పైకి, పైపైకి...' అన్నదే జీవన సూత్రమైంది. ఈ చినుకు పిట్టని చూశాకే తెలిసింది, పైకెగరడానికి రెక్కలే కావలసి వస్తే, కిందికి జారడానికీ రెక్కలుండాలని! గాలి రెక్కలల్లారుస్తూ చినుకుపిట్ట కిందికి ఎగురుతోంది. ఏదైనా కింద పడిపోతే, 'అరెరే..' అంటూ బాధపడిపోయే మనస్తత్వాన్ని సమాజం నుంచి నేనూ అందిపుచ్చుకున్నాను. అందుకే అప్రయత్నంగా అరచేయి అడ్డు పెట్టి చినుకునడ్డగించాను. అరచేతిలో రాలిన ఒక చినుకు, పది చినుకులై చింది, నన్ను పరిహసిస్తూ, వేళ్ళ సందుల్లోంచి మళ్ళీ జారిపోయింది. చినుకంటే పడిపోవడమే, నేలమీద పతనమై, వాగుగా, వంకగా పరుగులెత్తడమే,... మొలకగా చివుళ్ళెత్తి, ఏపుగా పైకి ఎదగడమే. పడిపోవడమంటే మళ్ళీ నిలుచోవడమే. చినుకంటే వరదగా అంతటినీ తుడిచేయడమే, ఒండ్రుగా నేలని సారవంతం చేయడమే. చినుకంటే సేద్యం, చినుకంటే ఫలసాయం, చినుకంటే ఉప్పెన, చినుకంటే ఉపద్రవం, చినుకంటే ఒకచోట బతుకును ముంచేసి, కాల్చేసే నీటి నిప్పు, మరోచోట పిడికెడు ముద్దయి, ఆకలి నిప్పునార్పే నీటి విత్తనం. చినుకంటే ఖేదం, మోదం కలిసిన కోటికదŠల సంకలనం. కురుస్తున్న వానకి చెవి ఒగ్గండి.., కథాసరిత్సాగరపు చెలియలికట్ట చినుకై చిట్లి, ధారగా హోరుమంటుంది.
అందుకే, ముంచినా, తేల్చినా చినుకును మళ్ళీ మళ్ళీ పిలుద్దాం. రా.., వేసవి నాటి నిప్పుల ఉప్పెన నుంచి కాసింత సేదదీర్చి పో..., 'వానా.., వానా..., వల్లప్పా'లు పాడుకుంటూ మేమంతా చినుకంత పిల్లలమై మళ్ళీ చిగురిస్తాం.., నీ మింటి రాదారిని వదిలి రా, నీ కోసం నేనీ మట్టి మీద ఆకాశాన్నై పరచుకుంటాను.., నెత్తురు మాత్రమే చిందుతున్న ఈ భూమ్మీద చల్లగా కాసిని నీళ్ళనీ చిందించి పో!
-పసుపులేటి గీత

Tuesday, July 7, 2009


మహ్మద్‌ దర్వీష్
నేనక్కడి వాడినే
రిగ్గా గుర్తులేదు కానీ, ఆరోజు నేను చదివిన కవిత భావాన్ని చెబుతాను. ఒక అరబ్బు పిల్లాడు, మరో యూదు బాలునితో ఇలా అంటాడు... 'ఎండలో నీ ఇష్టం వచ్చినంత సేపు నువ్వాడుకోవచ్చు, నీ బొమ్మలు నీకుంటాయి... కానీ నాకే ఆటలూ లేవు, బొమ్మలూ లేవు/ నీకో అందమైన ఇల్లుంది, నాకు గూడే లేదు/ నీకు వేడుకలున్నాయి/ నాకేమీ లేవు, మనిద్దరం కలిసి ఎందుకాడుకోకూడదు?...' ఇందులో మీకేమైనా తప్పుగా వినిపించిందా? కానీ మిలిటరీ గవర్నర్ కి మహాపరాధమే ధ్వనించింది. నన్ను పిలిచాడు. 'ఇలాంటి రాతలే రాస్తే, మీ నాన్నని క్వారీ పనిలోంచి తీసేస్తాను...' అంటూ తర్జనితో బెదిరించాడు నన్ను. చిన్నతనంలో బడి వార్షికోత్సవం లో నేను చదివిన కవిత ఆయనకి కోపం తెప్పించింది. ఇలాంటి కవితలు రాయడం మానేయమంటూ నాకు హుకుం జారీ చేశాడు. కానీ ఇలాంటి హుకుంల నీడలో ఇరవయ్యారేళ్ళు ప్రవాసిగా, దేశబహిష్కారానికి గురై ప్రపంచాన్ని చుట్టిన నాలో మాతృదేశంపై మమకారం నానాటికీ హెచ్చిందే తప్ప తగ్గలేదు.
'నమోదు చేసుకో, నేను అరబ్బుని! నా గుర్తింపు కార్డు నెంబరు యాభైవేలు. నాకెనిమిది మంది పిల్లలు. వేసవి తరువాత తొమ్మిదోది పుట్టబోతుంది, నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! తోటివారితో కలిసి క్వారీలో పనిచేస్తుంటా! నాకెనిమిది మంది పిల్లలు, వాళ్ళకి తిండీ, బట్టా, పుస్తకాల్ని రాళ్ళనించే తెస్తాను! నీ గుమ్మం ముందు నుంచుని యాచించను, నీ కార్యాలయపు మెట్ల మీద నుంచుని నన్ను నేను కించపరచుకోను, అందుకే నీకు మంటగా ఉందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! బిరుదులూ లేని పేరొకటుంది నాకు, జనం నిప్పులు కక్కే దేశంలో నేనోర్పుగా ఉన్నా! కాలం పుట్టక ముందే, యుగాలు కళ్ళు తెరవక ముందే ఆలివ్చెట్లూ, గడ్డీ మొలవక ముందే నా వేళ్ళు దేశంలో పాతుకుపోయాయి. నా తండ్రిది నాగలిపట్టిన వంశం. వాళ్ళు ధనికులు కారు. నా తాత గాలికీ, ధూళికీ పెరిగిన పేద రైతు, వాళ్ళు నాకు ఎండపాటులోని గొప్పదనాన్ని నేర్పారు. వెదురు బొంగులతో కట్టిన గుడిసె నా ఇల్లు. నా పేదరికం నీకు తృప్తినిచ్చిందా? నమోదు చేసుకో, నేనొక అరబ్బుని! నేను, నా పిల్లలు సాగు చేసుకుంటున్న తాతముత్తాల నాటి నా తోటని నువ్వు దొంగిలించావు. రాళ్ళు తప్ప మాకేమీ మిగల్చలేదు. అందుకే మొదటి పేజీలో రాసుకో, నాకు మనుషులంటే కోపం లేదు, నేను దేన్నీ ఆక్రమించను, కానీ నాకాకలైతే మాత్రం నన్ను దోచుకున్న వాడి మాంసమే నా ఆహారం! తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, నా ఆకలి నుంచీ, నా ఆగ్రహం నుంచీ తస్మాత్ జాగ్రత్త!' అంటూ నిప్పులు చెరగడానికి సరిహద్దులు అడ్డుకాలేదు.
'నేనక్కడి వాడినే, నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. అందర్లాగే నేనూ పుట్టాను. నాకూ అమ్మ ఉంది, తోబుట్టువులూ, స్నేహితులతో పాటు బోల్డు కిటికీలున్న ఇల్లూ ఉంది, దాంతో పాటు జైలుగదీ ఉంది, దానికో చలి కిటికీ ఉంది, సముద్రపు కాకులు మోసుకొచ్చిన అలొకటి నాదగ్గరే ఉంది. ఇదంతా నాదైన సర్వదిగ్దర్శక చిత్తరువు. నాకొక పరిపూర్ణమైన మైదానముంది. నా పదానికి లోతైన దిజ్ఞ్మండలముంది. పిట్టలకి జీవనాధారమైన జాబిలొకటి నాకుంది. అనశ్వరమైన ఆలివ్వృక్షమూ ఉంది. కత్తులు మనిషిని ఎరగా మార్చకముందే నేనక్కడ నివసించాను. నేనక్కడి వాడినే. స్వర్గం తన తల్లికోసం గుక్కపట్టినప్పుడు నేను దాన్ని దాని తల్లి చేతిలో పెట్టాను. నేను దుఖిమ్చాను, నా అశ్రువుల్ని మేఘమైనా తిరిగి మోసుకొస్తుందేమోనని. నియమానికి విరుద్ధంగా రక్తవిచారణకి అవసరమైన అన్ని పదాల్నీ నేను నేర్చుకున్నాను. ఒకే ఒక్క పదం కోసం నేర్చుకున్న అన్ని పదాల్నీ ధ్వంసం చేశాను. పదమేమిటో తెలుసా, 'స్వదేశం!' పాలస్తీనా నా ప్రేయసి, ఆమెవి పాలస్తీనా కళ్లు, ఆమె పేరు పాలస్తీనియను, ఆహార్యంలోనూ, విషాదంలోనూ ఆమె పాలస్తీనీయనే, ఆమె ఆపాదమస్తకం పాలస్తీనియనే, ఆమె మాటలు, ఆమె నిశ్శబ్దం పాలస్తీనియనే, ఆమె పుట్టుకా, ఆమె చావూ పాలస్తీనియనే! ప్రేమలోంచే నేనొక 'నిరసనకారుని'గా, కవిగా ఎదిగాను.
'ఇది సుసాధ్యమే, కొన్ని సమయాల్లోనైనా ఇది సుసాధ్యమే! మరీ ముఖ్యంగా ఇప్పుడు సుసాధ్యం, జైలు గదిలో గుర్రపు స్వారీ చేస్తూ పారిపోవడం సుసాధ్యమే. అదృశ్యమవడం జైలు గోడలకు సుసాధ్యమే. జైలుగది సరిహద్దుల్లేని సుదూర సీమవుతుంది. గోడల్ని నువ్వేం చేసుకుంటావు? అందుకే వాటిని రాళ్ళకి తిరిగిచ్చేస్తాను. పైకప్పుతో నీకేం పని? దానిని నేను గుర్రపు జీనుగా మార్చేస్తాను. ఇక సంకెళ్ళు,.. నేను వాటిని తూలికలుగా మారుస్తాను. మాటలు గార్డుకి కోపాన్ని తెప్పించాయి. కవిత్వమంటే తనకి గిట్టదన్నాడు. నా జైలుగది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. పొద్దుటే తిరిగి నన్ను చూడ్డానికొచ్చాడు. కోపంగా అరిచాడు, ఎక్కడివీ నీళ్ళన్నీ? నైలునది నుంచి నేనే తెచ్చానన్నాను, చెట్లూ...? డమాస్కస్తోటల్నించి తెచ్చా! సంగీతం...? నా గుండెచప్పుణ్ణుంచి తెచ్చా! గార్డుకి పిచ్చెక్కింది, నా మాటలకి కళ్ళెం బిగిస్తూ నా గది తలుపులకి గొళ్ళెం పెట్టాడు. సాయంత్రం మళ్ళీ వచ్చాడు. చంద్రుడెక్కడి నుంచొచ్చాడని అడిగాడు. బాగ్దాద్రాత్రుల నుంచి అన్నాను. మధువు...? అల్జీర్స్ ద్రాక్షతోటల్నుంచి! స్వేచ్ఛ...? రాత్రి నువ్వు నాకు బిగించిన సంకెల నుంచి! గార్డు దుఖితుడయ్యాడు. తన స్వేచ్ఛని తనకిమ్మని అతను ప్రాధేయపడ్డాడు.' నా 'జైలుగది' పాలస్తీనా ప్రజల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంది.
నా పాలస్తీన్లిబరేషన్ఆర్గనైజేషన్మిత్రుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఓస్లో ఒప్పందాన్ని వ్యతిరేకించకుండా ఉండలేని నా పట్టుదలలోంచి వాళ్ళనిలా ప్రశ్నిస్తున్నాను. సమున్నతమైన శిఖరాల్నుంచీ ఇలా అగాధాల్లోకి మనం జారిపడక తప్పదా?! మనం దేవతలం కామని తెలుసుకోవడానికి మన చేతులకీ రక్తపు మరకలంటక తప్పదా? మన నిజస్వరూపం కన్యాత్వాన్ని కోల్పోయిందని చెప్పడానికి మనం మన మర్మావయాల్ని లోకం ముందు ప్రదర్శించక తప్పదా? 'మేం ప్రత్యేకమైన వాళ్ళం' అని ఎప్పుడైతే మనం చెబుతామో అప్పుడు మనను మించిన అబద్దాలకోరులుండరు. ఇతరులకు అసత్యం చెప్పడం, నీ మీద నీకు అర్థరహితమైన నమ్మకాన్ని కలిగి ఉండడం ఒక్కటే! మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడం, మనల్ని ప్రేమించే వారిని ద్వేషించడం..., దీనికన్నా అవివేకం మరొకటుందా?!
గతమా మమ్మల్ని మార్చొద్దు, నీనుంచి మేమెప్పుడో దూరంగా పారిపోయాం. మీరెవరు, నానుంచి మీకేం కావాలి అని భవితవ్యమా మమ్మల్ని ప్రశ్నించొద్దు. మాకేం కావాలో మాకే తెలియదు కాబట్టి. వర్తమానమా, మమ్మల్ని కాస్త భరించు, ఎందుకంటే మేం కేవలం బావురుమంటూ దారిన పోయే దరిద్రులం కాబట్టి! అస్థిత్వమనేది మనకు వారసత్వంగా సంక్రమించలేదు, మరణశాసనం ద్వారానే దాన్ని పొందాం. మన ముఖం మనకు అందంగా కనిపించగానే చేజేతులా మనమే పగలగొట్టుకున్న అద్దం మన అస్థిత్వం! నువ్వెంత సేపైనా నా కళ్ళలోకి సూటిగా చూడు, అక్కడ నీకు నా చూపు దొరకదు. ఎందుకంటే ఒక వదంతి దాన్ని దొంగిలించేసింది. నా హృదయం నాది కాదు, అది ఎవరిదీ కాదు. శిలగా మారకుండానే అది స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. ఖైదీ కారాగారాన్ని చేరడానికి తాపత్రయ పడుతున్నాడు, తన విజయ హాసాన్ని కెమెరాల కళ్ళనించి దాచేస్తున్నాడు. కానీ అతని కళ్ళు ఆనందాన్ని దాచిపెట్టలేక పోతున్నాయి, పాలస్తీనీయన్లుగా ఉన్నంతకాలం మనం స్వకాముకులం ఎందుక్కావాలి? 'నా బంధువుపై దాడికి నేనూ, ఆగంతుకుడూ సైన్యంలో కలుస్తాం, నా సోదరునిపై దాడికి నా బంధువూ, నేనూ సైన్యంలో చేరతాం. నా మీద దాడికి నేనూ, నా షేకూ సైన్యంలో కలుస్తాం'- జాతీయ విద్యా ప్రమాణాల్లో ఇదే తొలిపాటం. శత్రువు తూటాల వల్ల మరణించిన వాడా, తన సోదరుని తూటాల వల్ల మరణించిన వాడా..., అగాదాల చీకట్లో పడి స్వర్గానికి ముందుగా ఎవరు చేరుకుంటారు? నీ తల్లి గర్భం నుంచే నీ శత్రువు పుడతాడని ధర్మకోవిదులు కొందరంటారు. సంప్రదాయవాదులు నన్ను చిరాకు పెట్టరు. వారి లౌకికవాద సానుభూతిపరులు మాత్రం నన్ను చికాకు పరుస్తున్నారు. వారి నాస్తికవాద సానుభూతిపరుల్లాగే చికాకు పరుస్తున్నారు. నా అస్థిత్వానికి నేను అవమాన పడడం లేదు. ఎందుకంటే అదింకా నిర్మాణంలో ఉంది.
'అనిత్యమైన పదాల వెంటపడి పోతున్నవాళ్ళంతా వినండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయే తరుణమొచ్చింది. ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, మామధ్య మాత్రం వద్దు, మీరు వెళ్ళి పోయే సమయమొచ్చింది, ఎక్కడికైనా వెళ్ళి చావండి, మా మధ్య మాత్రం చావొద్దు!' ఇలా నేనన్నప్పుడు అందరూ నన్నొక దోషిగా చూశారు. పాలస్తీనా మెయిన్స్ట్రీమ్రాజకీయాల్ని సమర్థిస్తున్నానన్న అపప్రదని నేను మోశాను. కానీ నేను అపవాదులకీ జంకను. 'చెల్లెలా, నా గొంతులో కన్నీళ్ళున్నాయి, నా కళ్ళలో నిప్పులున్నాయి, నేను స్వతంత్రుణ్ణి! సుల్తాను ద్వారం ముందు నేను నిరసన తెలుపనక్కర్లేదు. ఇదివరకే మరణించిన వారంతా, రేపవల ద్వారం ముందు ఇకపై మరణించబోయే వారంతా నన్ను కౌగిలించుకున్నారు, నేనిప్పుడు వారి ఆయుధాన్ని!'
శత్రువును కూడా మానవీకరించే పనిని నేనాపను. నాకు హీబ్రూ నేర్పిన తొలిగురువు ఒక యూదు వ్యక్తి. నా జీవితంలో తొలిప్రేమపాదును చిగురింపజేసింది ఒక యూదు యువతే. నన్ను జైలుకు పంపిన తొలి న్యాయమూర్తి కూడా ఒక యూదు వనితే. అందుకే ఆది నుంచీ యూదుల్ని నేను దెయ్యాలుగానో, దేవతలుగానో చూళ్ళేదు, వాళ్ళని కేవలం నాలాంటి మనుషులుగానే చూశాను. యూదుల కోసం నేనెన్నో కవితలు రాశాను. వాటిలో ప్రేమ పార్శ్వాన్ని తప్ప యుద్ధ మూలాల్ని చర్చించలేదు.
గలీలీలోని అల్బిర్వాలో పుట్టాన్నేను. నాకప్పుడు ఏడేళ్ళు, ఇజ్రేలీ సైన్యం పాలస్తీనాపై సామూహిక హత్యాకాండకు పూనుకుంది. దాంట్లో భాగంగానే మా గ్రామాన్ని సైన్యం ధ్వంసం చేసింది. మా గ్రామాన్నే కాదు మరో నాలుగు వందల గ్రామాల్ని బుగ్గి చేసింది. మా కుటుంబం బతుకుజీవుడా అంటూ లెబనాన్కు పారిపోయింది. కానీ పుట్టినగడ్డ మీద మమకారం చావక దొంగతనంగా మా గ్రామానికి తిరిగి వచ్చాం. అప్పట్నుంచీ సైనిక పాలన కింద సొంత ఊరిలోనే పరాయివాళ్ళంగా బతికాం. ఇదిగో పరాయీకరణే నాకు మాతృదేశపు విలువను తెలియజెప్పింది. ఇందాక చెప్పిన 'రాతల'వల్ల నేను సైనిక పాలనలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. హింస 1950 నుంచీ 1970 వరకూ అంటే నేను పైచదువుల కోసం రష్యాకు వెళ్ళేంత వరకు నిరాటంకంగా సాగింది. అక్కడి నుంచీ ఈజిప్టుకీ, ఈజిప్టు నుంచి బీరట్ కి, మళ్ళీ బీరట్ నుంచి అరబ్బు దేశాల రాజధానులన్నింటినీ చుట్టి వచ్చి, పారిస్లో కొంతకాలమున్న తరువాత రమల్లాలో స్థిరపడ్డాను. అది కూడా నా జన్మభూమికి కొంత దూరంలోనే. 'నా ఆద్యంతాల్ని కలపడానికి ఆయువు సరిపోవట్లేదు..'! నిద్రంటే శాంతి, నిద్రంటే స్వప్నం, స్వప్నం నుంచి జనించేదే సుషుప్తి! పాలస్తీనియన్పిల్లలంతా నా కవితల్ని తమ కవితలుగా ప్రకటించుకునే రోజును స్వప్నిస్తూ..., ప్రవాసుల, దేశబహిష్కృతుల కన్నీళ్ళతో తడవని నేలని కలగంటూ ఎన్నటికీ సెలవడగని మీ దర్వీష్‌.
-పసుపులేటి గీత

(పాలస్తీనియన్‌ జాతీయ కవి మహ్మద్‌ దర్వీష్‌ 13, మార్చి, 1941న పాలస్తీనాలోని అల్బిర్వాకి చెందిన గలీలి అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాను ఆక్రమించిన తరువాత వీరి కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చినా శరణార్థుల్లా జీవించాల్సి వచ్చింది. చిన్నతనంలోనే దర్వీష్‌పై ఈ పరాయీకరణ ప్రభావం పడింది. యవ్వన తొలినాళ్ళలోనే ఆయన అరబ్బుల అస్థిత్వాన్ని ప్రకటిస్తూ చేసిన రచనల ఫలితంగా దేశ బహిష్కారానికి గురికావలసి వచ్చింది. ఇజ్రేలీ కమ్యూనిస్ట్‌ పార్టీ 'రఖా'లో ఆయన సభ్యులుగా ఉండేవారు. తరువాత పాలస్తీన్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్వో)లో సభ్యత్వం స్వీకరించారు. దర్వీష్‌ 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందంపై విముఖతతో పిఎల్వోకి రాజీనామా చేశారు. ఆయన ముప్ఫైకి పైగా కవితా సంపుటులు వెలువరించారు. పలు అంతర్జాతీయ పురస్కారాల్ని పొందారు. దర్వీష్‌ 9, ఆగస్ట్‌, 2008న గుండెకి శస్త్రచికిత్స జరిగిన తరువాత మరణించారు.)

Monday, July 6, 2009

యెహూద అమిచా



ప్రేమా, యుద్ధమూ , చరిత్రా వెరసి యెహూద అమిచా

వ్యావహారిక హీబ్రూ భాషలో కవిత్వం రాసిన తొలి ఇజ్రేలీ కవి యెహూద అమిచా. జర్మనీలో 3, మే, 1924న అమిచా జన్మించారు. ఆయన కుటుంబం 1936లో పాలస్తీనాకి వలస వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ యూదు దళాలతోను, 1948లో జరిగిన అరబ్ -ఇజ్రేలీ యుద్ధంలో ఇజ్రేలి రక్షక దళాలతోను కలిసి పని చేశారు. తరువాత హీబ్రూ సాహిత్యంపై కృషి చేశారు. కవిత్వంతో పాటు నవలలు, కథలు కూడా రచించారు. ఆయన రచనలు 37 భాషల్లోకి అనువాదమయ్యాయి. జెరూసలెంలో నివసించిన అమిచా 25, సెప్టెంబర్ , 2000న కాన్సెర్ తో మరణించారు. ప్రేమా, పరిత్యాగం ప్రధాన ఇతివృత్తాలుగా అమిచా కవిత్వ రచన సాగినప్పటికీ, రాజకీయ, చారిత్రక, సామాజిక సమస్యలపై కూడా అమిచా దృష్టి సారించారు. ఆధునిక ప్రేమకవిత్వానికి అమిచా చిరునామాగా మారినప్పటికీ, మానవ జీవన గమనంలోని అన్ని ఇతివృత్తాలను ఆయన సహజంగా, సరళశైలిలో అక్షరీకరించారు. హీబ్రూ భాష అప్పటిదాకా ప్రాచీన గ్రంధాలకే పరిమితమైన పరిస్థితి నుంచి దానిని యూదు ప్రజల మత, సాంస్కృతిక, రాజకీయ అవసరాల మేరకు సరళీకరించి, జన సామాన్యంలో ఆ భాషకు ప్రాచుర్యం కల్పించడంలో అమిచా కృషి ఎన్నదగినది. అమిచా కవితల్లో కొన్నింటికి తెలుగు అనువాదమిది.

నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

గిల్గాల్ నుంచి బయలుదేరిన సైన్యం
రాత్రంతా ప్రయాణించి మృత్యుక్షేత్రానికి చేరుకుంది, అంతే..
పడుగు పేకల యుద్ధభూమిలొ శవాలు దొర్లుతున్నాయి
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ట్యాంకులో పగుళ్ళలాగా రాక్షసంగా వాళ్ళ కళ్లు
నేనెప్పుడూ కొద్దిమందినే, వాళ్లు మాత్రం చాలా మందే...
నేను జవాబు చెప్పే తీరాలి, వాళ్లు నా తలని ప్రశ్నలతో హింసిస్తారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
గిబియోన్‌ ఆకాశంలో సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు,
ఎప్పట్లాగే యుద్ధపిపాసుల్ని ఎండ రెచ్చగొడుతోంది
రక్తమోడిన నా భార్యని నేను చూడలేక పోవచ్చు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
శామ్‌సన్‌, అతని బలమంతా నల్లని పొడవైన జుట్టులోనే ఉంది
నన్ను అమరుణ్ణి చేయగానే వాళ్ళు నాకు శిరోముండనం చేశారు
ప్రతిఘటించడాన్ని నిర్బంధంగా వాళ్ళు నాకు నేర్పారు
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక
ఎక్కడా చోటు లేకపోతే సింహపు గుహలోనైనా
నువ్వు అందంగా జీవించగలవు
ఏకాకిగా చావడానిక్కూడా నేను జంకను
అయినా, నా పడక మీదే మరణించాలన్నది నా కోరిక

చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
చరిత్ర పునరావృతమవుతుందో, లేదో నాకు తెలీదు
నాకు తెలిసినంత వరకు నువ్వు మాత్రం పునరావృతం కావు
నగరం రెండుగా చీలడం గుర్తుంది
యూదులు, అరబ్బులుగా మాత్రమే కాదు
మనం కలిసున్నప్పుడే
నువ్వూ, నేనుగా కూడా నగరం చీలిపోయింది

ప్రమాదాల పూర్ణగర్భాన్ని మనమే పుట్టించాం
మంచుతో ఉష్ణవాసాన్ని నిర్మించుకున్న ఉత్తర ప్రాంతవాసుల్లాగా
మృత్యుశీతల యుద్ధహర్మ్యాన్ని మనమే నిర్మించుకున్నాం
నగరం పునస్సంగమించింది
కానీ అక్కడ మనమిద్దరం కలిసి లేము
ఇప్పుడు నాకు బాగా తెలుసు
చరిత్ర పునరావృతం కాదని
నువ్వు పునరావృతం కావని నాకిది వరకే తెలిసినట్టు!

పర్యాటకులు
వాళ్ళనించి కేవలం సంతాపాన్నే పొందగలం
'హోలోకాస్ట్‌' స్మృతిచిహ్నం దగ్గర
వాళ్ళు బాసినపట్టు వేసుక్కూర్చుంటారు
'వెయిలింగ్‌ వాల్ దగ్గర విషణ్ణ వదనాలతో కనిపిస్తారు
ఆ తరువాత, హోటల్ గదుల్లోని భారీ కర్టెన్ల వెనుక
వాళ్ళు పగలబడి నవ్వుతారు
రాచెల్ , హెర్త్జ్ల్ ల సమాధుల వద్ద వాళ్ళు
మన అమరవీరుల విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగుతారు
మన యువకుల్ని చూసి లోలోపలే కుళ్ళుకుంటారు
మన అందమైన యువతుల వెంటపడి చొంగకార్చుకుంటారు
చల్లని నీలి స్నానాల గదుల్లో
త్వరగా త్వరగా తమ లోదుస్తుల్ని ఆరబెట్టుకుంటారు

బరువైన రెండు సంచుల్ని నేలమీద పక్కనే పెట్టుకుని
ఒకనాడు నేను డేవిడ్స్ టవర్ దగ్గర మెట్లమీద కూర్చుని ఉన్నాను
అక్కడికి కొంత దూరంలో తన పర్యాటకులతో కలిసి ఒక గైడ్‌ నిలుచున్నాడు
నా వంక వేలుపెట్టి చూపుతూ,
'అక్కడ రెండు సంచులతో ఒక మనిషి కూర్చున్నాడు, కనిపిస్తున్నాడా...
అతని తలకి కుడివైపున రోమన్ల కాలం నాటి కమానొకటుంది చూడండి' అంటున్నాడు
'అయ్యో అతనెళ్ళిపోతున్నాడు' ఆందోళనగా చెబుతున్నాడు
కానీ, నాకు మాత్రం,
'అక్కడొక రోమన్ల కాలంనాటి కమానుంది చూశారా, అది ముఖ్యం కాదు,
దాని పక్కనే ఎడమవైపున, కొంచెం కిందుగా, తన కుటుంబం కోసం
పళ్ళూ, కూరగాయలూ తీసుకువెళుతూ,
కాస్త సేదతీరడానికి అక్కడే కూర్చున్న మనిషిని చూడండి...' అని
ఆ గైడ్‌ చెప్పగలిగినప్పుడే
ఈ దేశానికి విముక్తి దొరుకుతుందనిపించింది.

-పసుపులేటి గీత